నేను గెలిచిన మూడు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వ నిజస్వరూపం బట్టబయలైంది: ఆనం రామనారాయణరెడ్డి

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం
  • ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరంలో బహిరంగ సభ
  • రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనన్న ఆనం  
  • చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్య 
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా హాజరయ్యారు. 

ఆయన ప్రసంగిస్తూ, నారా లోకేశ్ ప్రజల ఆశీస్సులతో 1600 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మకూరులో తట్టెడు మట్టి వెయ్యలేదని విమర్శించారు. ఇక్కడ ప్రజలకు ఇసుక దొరకకుండా చేసి వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సోమశిల ప్రాజెక్టు డ్యామేజ్ అయితే మరమ్మత్తుల కోసం వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు. 

"నేను వైసీపీ నుండి గెలిచిన మూడు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం మాఫియా రాజ్యం అయిపోయింది. రైల్వే లైన్, ప్రభుత్వ ఆసుపత్రి అన్నీ వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే, చంద్రబాబు మళ్లీ  ముఖ్యమంత్రి అవుతారు. యువతకు భవిష్యత్తు ఇచ్చేది లోకేశ్. ఆత్మకూరుని అభివృద్ది చేయబోయేది టీడీపీనే. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆత్మకూరుకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని కోరుతున్నాను. వైసీపీది విధ్వంసకర ప్రభుత్వం. కొత్తవి కట్టడం వీళ్ళకి చేతకాదు. అందుకే ఇది సైకో ప్రభుత్వం. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేసింది అంటే తన పతనాన్ని తనే కోరుకుంది. సోమశిల ప్రాజెక్టును సైకో ధ్వంసం చేశాడు. సోమశిల ఉత్తర కాలువను నాశనం చేశాడు. సైకో పోవాలి... సైకిల్ రావాలి" అంటూ ఆనం రామనారాయణరెడ్డి ఉద్వేగంతో ప్రసంగించారు.

Anam Ramanarayana Reddy
Yuva Galam Padayatra
Chandrababu
Nara Lokesh
TDP
Atmakur

More Telugu News